కరోనా కారణంగా వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. లాక్డౌన్ విధించడంతో థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. త్వరలోనే వీటిని తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వంలో కదలిక మొదలైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిర్ధిష్టమైన మార్గదర్శకాలని పాటించడానికి థియేటర్స్ ఓనర్స్ కూడా గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో థియేటర్ల రీ ఓపెన్కు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పబోతున్నట్టు తెలుస్తోంది.
డాక్టర్లు కూడా ఇందుకు అభ్యంతరం లేదని చెప్పడంతో థియేటర్లు తెరవడం ఇక లాంచనమే అనే మాటలు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్లు, థియేటర్ల రీఓపెన్పై రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో బుధవారం దిల్ రాజు, సి.కల్యాణ్, దర్శకుడు ఎన్.శంకర్, `మా` అధ్యక్షుడు నరేష్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ పి. రామ్మోహన్రావు, జీవితతో పాటు పలువురు ఇండస్ట్రీ నిర్మాతలు పాల్గొన్నారు.
గురువారం 3గంటలకు రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీతో సినీ రంగానికి చెందిన పలు శాఖలకు చెందిన కీలక నాయకులతో ప్రత్యేక సమావేశం జరగనుందని, ఈ కార్యక్రమంలో ప్రధానంగా షూటింగ్ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలని ప్రధానంగా చర్చించనున్నారని తెలిసింది. ఇక థియేటర్లు తెరిస్తే వైరస్ మరింత ప్రబలే అవకాశం వుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైద్యుల సూచనల్ని పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తలసాని వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.