తెలంగాణలో మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో కరోనా స్వైరవిహారం చేస్తోంది. ప్రమాదకర స్థాయిలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. టెస్టులు చేయడం లేదని రాష్ట్ర హైకోర్టు చాలా సార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని, వైద్య ఆరోగ్య శాకని మందలించిన విషయం తెలిసిందే. రోజు రోజుకూ వేల సంఖ్యలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఫ్రీ టెస్టులు చేయడం మొదలుపెట్టింది.
రాష్ట్రంలోని కేసుల్లో 70 నుంచి 80 శాతం జీహెచ్ ఎంసీ పరిథిలోనే నమోదవుతున్న నేపథ్యంలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ టెస్టుల్ని మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ర్యాపిడ్ టెస్టుల్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. కరోనా అనుమానితులకు 15 నుంచి 30 నిమిషాల లోపే ఫలితాల్ని వెల్లడించే విధంగా టెస్టులు చేయబోతున్నారు.
ర్యాపిడ్ యాంటీ డిటెక్షన్ ద్వారా గరిష్టంగా ఫలితాలు అరగంట వ్యవధిలోనే రానున్నాయి. దీనికి ఐసీఎంఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దీనికి సంబంధించిన కిట్లు ఢిల్లీ నుంచి తెలంగాణకు మరో 2 , 3 రోజుల్లో రానున్నాయి. కరోనా లక్షణాలు వున్న వారికి మాత్రమే ఈ పరీక్షల్ని చేయనున్నట్టు తెలిసింది.