స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ `పుష్ప`. సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. `రంగస్థలం` ఫార్ములాతో 80వ దశకం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ముత్యంశెట్టి మీడియా అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవల రాజమండ్రి సమీపంలో మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు.
బన్నీ పాల్గొనగా పోరాట ఘట్టాల్ని చిత్రీకరించారు. అయితే అనుకోకుండా టీమ్లో కొంత మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అర్థాంతరంగా షూటింగ్ ఆపేసి టీమ్ మొత్తం హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. కొంత విరామం తీసుకున్న సుకుమార్ మళ్లీ కాచీగూడలో పోరాట ఘట్టాల్ని బన్నీ కొంత మంది ఫైటర్స్ పాల్గొనగా షూట్ చేశారు. తాజాగా మళ్లీ మారేడు మిల్లికి టీమ్ వెళుతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఇందులో ప్రధాన విలన్గా తమిళ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్న చిత్ర బృందం ఆయన కొన్ని కండీషన్ల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో విలన్ పాత్ర కోసం చాలా మంది నటుల్ని పరిశీలించి ఫైనల్గా తమిళ హీరో ఆర్యని ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్యతో పాటు కన్నడ హీరో ధనుంజయన్, కమెడియన్ కమ్ హీరో సునీల్ కూడా ఇందులో నెగెటివ్ పాత్రలో కనిపించనున్నట్టు తెలిసింది.