స్టార్ హీరోలు, హీరోయిన్లు కరోనా దెబ్బతో కొత్త రంగాల్ని వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా డిజిటల్ రంగంలోకి ప్రవేశిస్తోంది. తమిళంలో ఇప్పటికే ఓ వెబ్ సిరీస్లో నటించిన తమన్నా తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం టాక్ షోకు హోస్ట్గా వ్యవహరించబోతోంది. `ఆహా` ఓటీటీ కోసం తమన్నాతో ఓ టాక్ షోనిఅల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.
అల్లు అరవింద్, మైహోమ్ గ్రూప్ నిర్మించనున్న ఈ టాక్ షో కోసం తమన్నా భారీగానే పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టు గత రెండు మూడు రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. 20 ఎపిసోడ్లు గా ప్లాన్ చేస్తున్న ఈ టాక్ షో కోసం తమన్నా ఎపిసోడ్కి 7 లక్షలు పారితోషికం తీసుకోనుందట. అంటే 20 ఎపిసోడ్లకు గానూ తమన్నాకు కోటి 40 లక్షలు అందనున్నట్టు తెలుస్తోంది.
అంటే దాదాపుగా ఓ సినిమా చేస్తే అందుకునే పారితోషికం కంటే టాక్ షోతో తమన్నా ఎక్కువే తీసుకోనుండటం ఆసక్తికరంగా మారింది. తమన్నా నటించే టాక్ షో ఇండోర్లోనే కాబట్టి కరోనా ప్రభావం వుండదని చెబుతున్నారు. ఇదిలా వుంటే తమన్నా ప్రస్తుతం `సీటీమార్` చిత్రంలో తెలంగాణ కబడ్డీ కోచ్ గా నటిస్తోంది. సంపత్నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ని చిత్ర బృందం నిలిపివేసింది.