సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం `మహానటి`. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని సాధించడంతో తెలుగులో బయోపిక్ల పరంపర మొదలైంది. తాజాగా మరో బయోపిక్ తెరపైకి రాబోతోంది. 2000లో ఒలింపిక్ మొడల్ని వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్కు అందించి చరిత్ర సృష్టించింది కరణం మల్లేశ్వరి.
ఆమె జీవిత కథని కోన వెంకట్, ఎంవీవీ సత్యానారాయణ తెరపైకి తీసుకురాబోతున్నారు. సంజనారెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుంది. ఇటీవలే అఫీషియల్గా ఈ చిత్రాన్న నిర్మించబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో ఈ సినిమాపై చర్చ మొదలైంది. కరణం మల్లేశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారా అని. ముందు నిత్యామీనన్ని ఈ పాత్ర కోసం సంప్రదిస్తే తను సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది.
తాజాగా ఈ పాత్ర కోసం తాప్సీ, రకుల్ ప్రీత్సింగ్ల పేర్లని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టు ప్రచారం మొదలైంది. అయితే ఈ ఇద్దరిలో తాప్సీ ఆసక్తి చూపిస్తున్నట్టు వినిపిస్తోంది. మేకర్స్ కూడా తాప్సీనే ఫైనల్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే తాప్సీ స్పోర్ట్స్ డ్రామాల్లో నటించడంతో ఈ పాత్రకి మేకర్స్ తాప్సీని తీసుకుంటేనే సినిమా పబ్లిసిటీ వైజ్గా భారీ స్పాన్ వుంటుందని తెలుస్తోంది.