సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. సుశాంత్ మరణించి నెల దాటుతున్నా ఆయన మరణం వెనకున్న మిస్టరీ మాత్రం వీడటం లేదు. సీరియల్ తరహాలో రోజుకో ట్విస్ట్ బయటపడుతూ పలు అనుమానాలకు తావిస్తోంది. సుశాంత్ ఆత్మ హత్య కేసుని సీబీఐకి అప్పగించాలంటూ చేసిన అప్పీల్ను సుప్రీమ్ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా ట్విస్టులు బయటికి వస్తున్నాయి.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మ హత్య కేసులో విచారిస్తున్న బాంద్రా పోలీసులు ఇప్పటికే 37కు మించి వ్యక్తుల్ని విచారించి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అయినా కేసు మాత్రం ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్టుగా కనిపించడం లేదు. ఇదిలా వుంటే తన కుమారుడి హత్యకు రియాతో సహా ఆరుగురు కారణం అంటూ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
తాజాగా శుక్రవారం సుశాంత్ స్నేహితుడు, క్రియేటివ్ కంటెంట్ మేనేజర్ సిద్ధార్థ్ పితాని తనపై సుశాంత్ కుటుంబం ఒత్తిడి చేస్తోందని, రియాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమంటోందని స్టేట్మెంట్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయాన్ని పితాని బాంద్రా పోలీసులకు ఈమెయిల్ ద్వారా వెల్లడించడం సుశాంత్ కేసులో కొత్త ట్విస్ట్గా చెబుతున్నారు. సుశాంత్ సోదరి మీతూ సింగ్, ఆయన భర్త ఓపీ సింగ్ తనని రియాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేస్తున్నారంటూ పితాని వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయం తెలిసిన బాలీవుడ్ జనాలు మాత్రం ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు బయటికి వస్తాయో చూడాలి అంటున్నారు.