కరోనా ప్రతీ రంగాన్ని కొత్త దారులు పట్టిస్తోంది. కొత్త ఆలోచనలకు పురికొల్పుతోంది. లాక్డౌన్ సమయంలో.. లాక్డౌన్ సడలించిన తరువాత కూడా పరిస్థితుల్లో వైరస్ నివారణలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవడంతో సినిమా రంగం కొత్త దారులు వెతుకుతోంది. గత మూడున్నర నెలలుగా సినీ ఇండస్ట్రీలో థియేటర్లు మూసివేయడంతో తీవ్ర సంక్షోభం నెలకొంది. దీని నుంచి బయటపడాలంటే డిజిటల్ రంగం ఒక్కటే మార్గమని బలంగా నమ్మిన వారంతా ఈ రంగంవైపు అడుగులు వేస్తున్నారు.
తమ సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా హీరో సూర్య కూడా ఓటీటీ వైపు అడుగులు వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి సూర్య ఏకంగా డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఓ వెబ్ సిరీస్లో నటించబోతున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం `నవరస` పేరుతో ఓ వెబ్ సిరీస్ని నిర్మించబోతున్నారు. నవరసాల సమ్మేళనంగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. దీనికి తొమ్మిది మంది దర్శకులు దర్శకత్వం వహించనున్నారు.
మణిరత్నంతో కలిసి పనిచేసిన అరవిందస్వామి, సిద్ధార్ధ్ తో పాటు మరి కొంత మంది స్టార్స్ ఈ వెబ్ సిరీస్లో నటించనున్నారట. ఇది సూర్య నటించనున్న తొలి వెబ్ సిరీస్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని మణిరత్నం త్వరలోనే వెల్లడించనున్నారట. సూర్య నటించిన తాజా చిత్రం `ఆకాశమే నీ హద్దురా` రిలీజ్కి రెడీగా వుంది. ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.