తెలుగు, తమిళ భాషల్లో పాపులర్ అయిన బ్రదర్స్ సూర్య. కార్తి. గత కొంత కాలంగా సూర్య సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే తమ్ముడు కార్తీతో కలిసి నటించే మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా వారి దృష్టి మలయాళ హిట్ చిత్రంపై పడిందని తెలిసింది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించి తెరకెక్కించిన చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్`.
పృథ్విరాజ్తో కలిసి ఈ చిత్రంలో బీజు మీనన్ నటించిన ఈ చిత్రం మలయాళంలో అనూహ్య విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేయాలని చాలా మంది దర్శకనిర్మాతలు, హీరోలు పోటీపడుతున్నారు. ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కుల్ని సితార ఎంటర్టైన్మెంట్ అధినేత సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు. హిందీ రీమేక్ హక్కుల్ని జాన్ అబ్రహం దక్కించుకున్నారు.
తమిళంలో మాత్రం ఈ చిత్రాన్ని సూర్య, కార్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే హీరో సూర్య ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారని, త్వరలోనే రీమేక్ కు సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడంచనున్నారని తెలిసింది.