చాలా ఏళ్ల తరువాత తెలుగు తెరపై తెరకెక్కుతున్న మైథలాజికల్ వండర్ `హిరణ్య కశ్యప`. రానా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ సెట్టింగుల దర్శకుడిగా పేరున్న గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్తో కలిసి ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. గత మూడేళ్లుగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
తాజాగా ఈ వర్క్ పూర్తయిందని, ఇక త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నామని దర్శకుడు గుణశేఖర్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు జరిగిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం చిత్ర బృందం 15 కోట్లు ఖర్చు చేసిందని తెలిసింది. ఈ వార్త ఇండస్ట్రీ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది. డి. సురేష్బాబు వంటి నిర్మాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఏకంగా 15 కోట్లు ఖర్చు చేయడమేంటని అంతా అవాక్కవుతున్నారు.
దీనిపై ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత డి.సురేష్ బాబు ఈ మూవీ బడ్జెట్పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని చిత్రాలకు కథ రిత్యా భారీ బడ్జెట్తో నిర్మించడం అవసరం. వాటిని అలానే నిర్మించాలి. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే ఆ మాత్రం బడ్జెట్ వుండాల్సిందే. కథ రిత్యా అది అవసరం కూడా. స్క్రిప్ట్ విషయంలో రాజీపడకూడదు` అని వివరణ ఇచ్చారు. ఈ చిత్రానికి దాదాపు 130 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు.