థియేటర్లన్నీ కేవలం నలుగురి చేతుల్లోనే వున్నాయని, చిన్న సినిమా బ్రతకడమే కష్టంగా మారిందని గత కొంత కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీనిపై సురేష్ ప్రొడక్షన్స్ అథినేత డి. సురేష్బాబు స్పందించారు. బిజినెస్ అనేది ఎక్కడైనా ఒక్కరి చేతుల్లోనే వుంటుందని, ఇది ఎక్కడైనా జరిగేదే అని చెప్పుకొచ్చారు. అమెరికాలో 50 వేల థియేటర్లు వుంటాయి. వాటిని నలుగురైదుగురు మాత్రమే నియంత్రిస్తారు. అప్పుడే అన్నీ సవ్యంగా నడుస్తాయి. ఇండియాలో మల్టీప్లెక్స్ థియేటర్స్ కొంత మంది చేతుల్లోనే వున్నాయి. అలాగే మా లాంటి వాళ్ల దగ్గర కూడా థియేటర్లు వుండవచ్చు` అన్నారు.
థియేటర్లు నడపడం రిస్క్ అనుకున్న వాళ్లు అమ్మేస్తున్నారు. వాళ్ల దగ్గరి నుంచి కొనుగోలు చేసి వాటిని కొత్తగా మార్చి అద్దెలకు ఇస్తున్నాం. అలా వున్నా ఒక్కో సందర్భంలో మాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉం టాయి. థియేటర్లపై నియంత్రణ వున్న వాడినే అయితే నేను నిర్మించిన `వెంకీమామ` చిత్రాన్ని జనవరి 14నే రిలీజ్ ఏసుకునేవాడిని కదా!. ఎందుకు చేసుకోలేదు?. నా కంటే ముందే ఇద్దరు ముగ్గురు నిర్మాతలు తమ విడుదల తేదీలను ప్రకటించారు. దాంతో నా సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చారు.
పర్సెంటేజ్ విధానం వస్తే అన్ని సినిమాలకు బాగుంటుంది. ఇప్పటికే మల్టీప్లెక్స్ లు ఆ విధానంలోనే సినిమాలని ప్రదర్శిస్తున్నాయి. అందుకే బిజినెస్ నడుస్తోంది. లేదంటే పరిస్థితులు మరోలా వుండేవి. అంతా అంటున్న నియంతృత్వం అనేది ఇండస్ట్రీలో లేదు. కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాకు వెళ్లి చెక్ చేయించా. అలాంటిది ఏమీ లేదు. ఏదైనా రూల్ ప్రకారమే నడుస్తోంది అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. అయితే సురేష్బాబు చేసిన వ్యాఖ్యల పట్ల చిన్న నిర్మాతలు మాత్రం సుముఖంగా కనిపించడం లేదు.