కేంద్రం క్రమ క్రమంగా అన్ని వ్యవస్థల్ని అన్ లాక్ చేస్తూ వస్తోంది. కరోనా భయంతో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ని విధించిన కేంద్రం మూడు నెలల తరువాత అన్లాక్ పేరుతో వరుసగా వివిధ రంగాలని తెరుస్తూ వెళుతోంది. తాజాగా అన్లాక్ 3.0 లో భాగంగా ఆగస్టు 1 నుంచి సినిమా హాళ్లు, జిమ్లు తెరవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయబోతోంది. దీంతో కొంత మంది థియేటర్ యజమానులు థియేటర్లు తిరిగి తెరవడానికి రెడీ అయిపోతున్నారు.
కానీ కొంత మంది మాత్రం అలా తెరిస్తే మరింత నష్టం వస్తుందని, థియేటర్లు తెరిచే ప్రసక్తి లేదని చెబుతున్నారు. సునీల్ నారంగ్తో కలిసి గత కొంత కాలంగా ఏషియన్ ధియేటర్స్ తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లని లీజుకు తీసుకుని రన్ చేస్తున్న డి. సురేష్ బాబు కూడా తనకు సంబంధించిన థియేటర్లని తెరచే ప్రసక్తి లేదని చెబుతున్నారు. సురేష్బాబు చేతిలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 400 థియేటర్లు వున్నాయి. వీటిని ప్రస్తుత పరిస్థితిల్లో ఓపెన్ చేసే ప్రసక్తిలేదని చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్ తెరవడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్ని మూడు గంటల పాటు థియేటర్లలో కూర్చోబెట్టి వారి జీవితాలని రిస్క్లో పెట్టలేము. చైనాలో కేసులు తగ్గుముఖం పట్టడంతో థియేటర్లను తెరిచారు. కానీ ఆ తరువాత మళ్లీ మూశారు. ఈ సమయంలో బిజినెస్ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. థియేటర్లు మూయడం మాకూ నష్టమే కానీ ఆ వంకతో ప్రజల జీవితాలతో , వారి ఆరోగ్యంతో ఆడుకోలేము. పైగా థియేటర్లు తెరిచినా సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ 25 శాతం మాత్రమే డిక్కెట్లు సేల్ చేయాలంటే నిర్మాతకు నష్టమే కదా. దీనికంటే సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు థియటర్లు తెరవకపోవడమే మంచిది` అన్నారు సురేష్బాబు.