సురేందర్ రెడ్డికి దర్శకుడిగా విభిన్నమైన శైలి. అయితే సూపర్ హిట్ ఇస్తాడు. లేదా ప్లాప్ ఇస్తాడు. యావరేజ్ అన్న మాటే తనకు తెలీదు. కెరీర్ తొలి సినిమానే అతనొక్కడేతో సంచలనాన్ని సృష్టించాడు సురేందర్. ఈ సినిమాలో హీరోయిన్ ఓపెనింగ్ సీన్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు అనే రైటింగ్ లో సురేందర్ ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం. అలాంటి సురేందర్ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే డైరెక్ట్ చేసి సైరాతో టాప్ లీగ్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు.
సురేందర్ కు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఎవరికి థాంక్స్, ఎవరికి సారీ చెప్పాలనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. ఆ రెండూ కూడా ఒకళ్ళకే చెప్పాలనుకుంటున్నానని సురేందర్ రెడ్డి అన్నాడు. ఆ వ్యక్తి నందమూరి కళ్యాణ్ రామ్ అని అన్నాడు. తనకు తొలి సినిమా అవకాశం ఇవ్వడానికి చాలా మంది సందేహించారని, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి, దిల్ రాజుకు అతనొక్కడే కథ చెప్పానని.. అయితే వాళ్లకు కథ నచ్చినా దర్శకుడిగా అవకాశం ఇవ్వడానికి సందేహించారు.
నందమూరి కళ్యాణ్ రామ్ నన్ను నమ్మి, స్వంత నిర్మాణంలో అతనొక్కడే చేసాడు. తను అవకాశం ఇవ్వకపోతే నేను లేను.. కాబట్టి అతనికి థాంక్స్. అయితే అదే కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కిన కిక్ 2 చిత్రంతో డిజాస్టర్ ను అందించాను. ఆ సినిమా విషయంలో చాలా తప్పులు జరిగాయి. ఏదీ నేను అనుకున్నట్లు రాలేదు. అసలు దానికి కిక్ 2 అన్న టైటిల్ పెట్టడమే పెద్ద తప్పు. సరైన ఫలితం ఇవ్వలేకపోయినందుకు కళ్యాణ్ రామ్ కు సారీ అని ముగించాడు.