స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా బిజీగా వుంటూనే నిర్మాతగా కూడా వరుస చిత్రాల్ని నిర్మిస్తూ బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి ఆయన నిర్మించిన చిత్రం `ఉప్పెన`. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరో, హీరోయిన్ లుగా పరిచయమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో సుకుమార్ మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న `18 పేజెస్` చిత్రానికి సుకుమార్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిఖిల్ హీరోగా నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు.
`18 పేజెస్` మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. అయితే ఈ చిత్రాన్ని చూసిన దర్శకుడు
సుకుమార్ కరెక్షన్స్ సూచించారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మార్పులు చేర్పులు జరుగుతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. తాను ప్రతిపాదించిన దిద్దుబాట్లు జరిగిన తరువాతే విడుదల చేయాలని సుకుమార్ భావిస్తున్నారట.