తెలుగు సినిమా సత్తాని యావత్ ప్రపంచానికి చాటిన చిత్రం `బాహుబలి`. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి హాలీవుడ్ సినీ ప్రియులని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్తో సినిమాల నిర్మాణం ఊపందుకుంది. అదే కోవలో మెగాస్టార్ చిరంజీవి అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. రామ్చరణ్ నిర్మాతగా సురేందర్రెడ్డి రూపొందించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లని రాబట్టలేకపోయింది.
తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా అత్యంత అతెంటిక్గా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ వసూళ్లని రాబట్టిన ఈ చిత్రం ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా బాలీవుడ్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేక నష్టాల్ని తెచ్చిపెట్టింది. కొన్ని ఏరియాల్లో వసూళ్లే లేవు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తప్ప అంతటా మిశ్రమ స్పందన లభించడంతో నష్టాలొచ్చాయి. ఈ చిత్రంలో అవుకు రాజు పాత్రలో నటించిన కన్నడ హీరో సుదీప్ ఈ చిత్ర ఫలితంపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ చిత్రాన్ని అంతా `బాహుబలి`తో పోల్చి చూశారని, అదే ఈ సినిమాకు శాపంగా మారిందని చెప్పుకొచ్చారు. `బాహుబలి` ఓ ఫిక్షన్ అని `సైరా నరసింహారెడ్డి` అలాంటి ఫిక్షన్ కాదని, ఓ స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారని, అందుకే ఈ సినిమా ఎక్కువ మందికి రీచ్ కాలేదని, పైగా ఇది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన యోధుడి కథ కావడం కూడా ఈ చిత్రం అందరిని చేరుకోవడానికి అడ్డంకిగా మారిందని చెప్పుకొచ్చాడు.