లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు, థియేటర్ల మూసి వేత సినీ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది.షూటింగ్లు ఆగిపోవడంతో చాలా వరకు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక థియేటర్లు మూసివేయడంతో రిలీజ్కు సిద్ధంగా వున్న చాలా చిత్రాలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. అందులో ముందు వరుసలో నిలిచిన చిత్రం `నిశ్శబ్దం`.
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన వెంకట్, టి.జి.విశ్వప్రసాద్ నిర్మించారు. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రల్లో నటించారు. లాక్డౌన్ తో థియేటర్లు మూసివేసిన కారనంగా చాలా చిత్రాలు ఓటీటీకి జైకొట్టాయి. దీంతో `నిశ్శబ్దం` కూడా ఓటీటీ బాటపడుతుందని, భారీ మొత్తాన్ని అందించడానికి అమెజాన్ ప్రైమ్ ముందుకు వచ్చిందని ప్రచారం జరిగింది.
దీనిపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. మా తొలి ప్రాధాన్యత థియేటర్.. అది కుదరని పక్షంలో పరిస్థితులని బట్టి వేరే మార్గాన్ని ఎంచుకుంటాం` అని వెల్లడించారు. అయితే ఉన్నట్టుండి హఠాత్తుగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రానికి ఆన్ లైన్ ద్వారా సెన్సార్ పూర్తి చేసిన సభ్యులు యు/ ఏ సర్టిఫికెట్ని జారీ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా వుంది.
`మా నిశ్శబ్దం, సైలెన్స్ వెర్షన్లకు సెన్సార్ పూర్తయింది. యు/ ఏ సర్టిఫికెట్ లభించింది. మా సినిమాపై సెన్సార్ బోర్డ్ ప్యానెల్ సభ్యుల స్పందన చూసి మురిసిపోయాను. ఈ చిత్రాన్ని ముందు థియేటర్లలోనే విడుదల చేయమని సలహా ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు` అని దర్శకుడు హేమంత్ మధుకర్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.