‘చందమామ, అలామొదలైంది, కల్యాణ వైభోగమే, నేనే రాజు నేనే మంత్రి’ వంటి హిట్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేసిన లక్ష్మి భూపాల్ రీసెంట్ గా ‘ఓ బేబీ’ చిత్రానికి పదునైన సంభాషణలు సమకూర్చారు. తన పెన్ పవర్ని చూపిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న లక్ష్మి భూపాల్ ‘ఓ బేబీ’ సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇన్నేళ్ల కేరీర్ లో ఆయన 60 సినిమాలకు డైలాగ్స్ రాశారు. అందులో సక్సెస్ శాతం 20.
ఫెయిల్యూర్ 80 శాతం అనే చెప్పాలి అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. గ్లామరస్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రల్లో నందిని రెడ్డి దర్శకురాలిగా లక్ష్మి, రావు రమేశ్, రాజేంద్ర ప్రసాద్, నాగశౌర్య కీలక పాత్రల్లోనటించిన ఓ బేబీ చిత్రానికి లక్ష్మి భూపాల్ మాటలు రాశారు. ఇటీవల రిలీజ్ అయినా ఈ చిత్రం సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది.
ఈ చిత్రానికి లక్ష్మి భూపాల్ రాసిన మాటలు ఎంతో ప్లస్ అయ్యాయి. తనకు ఏ సినిమాకి రానంత గుర్తిపు, సంతృప్తిని ఓ బేబీ ఇచ్చిందని రచయిత లక్ష్మీ భూపాల్ గంటా పదంగా చెబుతున్నారు. ఈ సందర్బంగా టాలెంటెడ్ రైటర్ లక్ష్మి భూపాల్ తో స్పెషల్ ఇంటర్వ్యూ …
– ‘నేను చిత్ర పరిశ్రమకు వచ్చి 15 ఏళ్లు అవుతోంది. దాదాపు 60 సినిమాలకు రాశాను. అందులో 15 సినిమాలు సక్సెస్ అయ్యాయి. ‘చందమామా’, ‘అలా మొదలైంది’, ‘మహాత్మ’, ‘కళ్యాణ వైభోగమే’ తదితర చిత్రాల కోసం పనిచేశారు. నాకు ఇన్ని సినిమాలతో రాని సంతృప్తి .. ‘ఓ బేబీ’తో లభించింది. నిజానికి నేను పెద్ద హీరోల సినిమాలకు రాయలేదు. దీంతో అసంతృప్తి కాస్త ఉంది. బహుశా నాకు పంచ్లు, ప్రాసలు రావని తీసుకోవడంలేదేమో. కానీ దాదాపు నాకు అందరు హీరోలు, దర్శకులతో పరిచయాలు ఉన్నాయి. ‘దేవదాసు’ సినిమాను కూడా మొదలు పెట్టి, మధ్యలో వచ్చేశా. నా తరఫున ఏమీ సమస్య లేదు.. నన్ను తీసుకోవాలని దర్శక, నిర్మాతలు అనుకోవాలి’.
– ‘నా జీవితంలో జరిగిన చాలా సంఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి. మా అమ్మ, అమ్మమ్మ.. మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు. అదంతా ఇందులో చూశా. నేను ఈ విజయాన్ని వాళ్లకే అంకితమిస్తా. ఈ సినిమా పుట్టింది కొరియాలో.. కానీ మనం పెంచుకున్నాం. మాటలు రాసుకున్నాం’.
– ‘ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి రూ.లక్ష పారితోషికం పెంచేవాడ్ని. సినిమా ఫెయిల్ అయినా.. నేనెప్పుడూ రచయితగా ఫెయిల్ కాలేదు. నిజానికి నా రెండో సినిమా ఫెయిల్ అయ్యింది. కానీ ప్రతిభ ఉంది కాబట్టే తర్వాత 60 సినిమాల్లో అవకాశం వచ్చింది. దాదాపు చాలా మంది రచయితలు కోపంతో దర్శకులు అవుతున్నారు. ‘మనం రాసింది వాళ్లు తీయడం లేదు, మనకు నచ్చినట్లు ఉంచడం లేదు’ అనే బాధతో అందరు రచయితల్లా దర్శకత్వం వైపుకు వెళ్లడం నాకు ఇష్టం లేదు’.
– ‘చిత్ర పరిశ్రమలో నేర్చుకోవడానికి ఏం ఉండదు. డబ్బులు సంపాదించుకుని, వెళ్లిపోవడమే.. కాకపోతే పని నేర్చుకుంటాం అంతే. నేను ఆఫీసుల చుట్టు తిరిగి రచయితను కాలేదు. అనుకోకుండా అయ్యా. ‘సోగ్గాడే’ సినిమాకు వేరే వాళ్లు సగం మాటలు రాశారు. అనుకోకుండా దాన్ని నేను పూర్తి చేయాల్సి వచ్చింది. అలా రచయిత అయ్యా’.
– ‘నా వద్ద దాదాపు 24 కథలు ఉన్నాయి. ఆరు నా కోసం పెట్టుకున్నా. మిగిలినవి అవసరమైన దర్శకులకు ఇస్తాను. డబ్బుల కోసం చిత్ర పరిశ్రమకు వచ్చాను. అదే పని చేస్తున్నా. దీనికంటే ఎక్కువ మొత్తం బయట వస్తాయంటే మొహమాటం లేకుండా వెళ్లిపోతా. నేను కథలు రాయడానికి విదేశాలకు వెళ్లను. నాకు పాస్పోర్ట్ కూడా లేదు. మా ఇంట్లో కూర్చునే రాస్తా’.
– ‘‘ఓ బేబీ’ తర్వాత చిత్ర పరిశ్రమకు చెందిన వారు చాలా మంది ఫోన్లు చేసి ప్రశంసించారు. తర్వాత దాదాపు 7 సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ అన్నీ చిన్న చిత్రాలే. వాటిలో కొన్ని సినిమాల కథలు కూడా నాకు నచ్చలేదు. ప్రస్తుతం నందిని రెడ్డి, తేజ దర్శకత్వంలో వస్తున్న రెండు సినిమాలకు రాస్తున్నా’.
– ‘సమంతకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. నేను ఎన్నో సినిమాలకు పనిచేశా. కానీ ఈ చిత్రానికి వచ్చిన ఆదరణ ఎప్పుడూ రాలేదు. ప్రతి ప్రెస్మీట్లో సమంత, నందిని నా పేరు ప్రస్తావించారు. చాలా మంది ఫోన్ చేసి కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్లాం అంటున్నారు. మా అమ్మ ఈ సినిమా చూశారు. తల్లి-కొడుకు మధ్య సీన్లు వచ్చిన ప్రతిసారి అమ్మ నావైపు చూస్తూ ఉన్నారు’ అంటూ ఇంటర్వ్యూ ముగించారు..!!