లాక్డౌన్ కారణంగా సినిమాల షూటింగ్లకు గత ఎనిమిది నెలలుగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో చాలా చిత్రాల షూటింగ్లు మధ్యలోనే ఆగిపోయాయి. తాజాగా అన్ లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా షూటింగ్లకు శరతులతో కూడిన వెసులుబాటు కల్పించడంతో టీవీ సీరియల్స్ నుండి `ఆర్ ఆర్ ఆర్` వరకు అన్ని చిత్రాల షూటింగ్లు క్రమ క్రమంగా పట్టాలెక్కాయి.
ఇదిలా వుంటే వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూవీ మాత్రం ఎలాంటి హడావిడీ చేయడం లేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పూరి, చార్మితో కలిసి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలుగా ఈ మూవీని మొదలుపెట్టారు. అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ కీలక షెడ్యూల్ లాక్డౌన్కి ముందు ముంబైలో జరిగింది.
కానీ భారీ చిత్రాల షూటింగ్లు తిరిగి పునః ప్రారంభం అవుతున్నా తన పాన్ ఇండియా మూవీని మాత్రం పూరి మొదలుపెట్టడం లేదు. పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆసక్తికర ఆడియోలని విడుదల చేస్తున్న పూరి తన తన సినిమాకు సంబంధించిన అప్డేట్ని మాత్రం పంచుకోవడానికి ఇష్టపడటం లేదు. దీంతో ఆయన ఈ ప్రాజెక్ట్ విషయంలో డైలామాలో వున్నారా అని ఇండస్ట్రీలో చర్చమొదలైంది. పూరి మనసులో ఏముంది.. కరణ్జోహార్ బడ్జెట్ ఇస్తున్నారా? అన్నది మాత్రం తెలియాల్సి వుంది.