శ్రియకు పెళ్లయిపోయింది. ఇక కెరీర్ అయిపోయినట్టే అనుకున్నారంతా. కానీ వరుస చిత్రాల్లో నటిస్తూ ఈ ఢిల్లీ సోయగం షాకిస్తోంది. గత ఏడాది బాలకృష్ణ నటించిన `ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలోని ఓ పాటలో తళుక్కున మెరిసిన శ్రియ ఆ తరువాత మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు. తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తున్న శ్రియకి తెలుగులో ఓ బంపర్ ఆఫర్ లభించినట్టు తెలిసింది.
`బాహుబలి` వంటి సంచలన చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` పేరుతో భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ కలిసి నటిస్తున్నారు. ఒకరు కొమరం భీంగా, మరొకరు అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా తాజా షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ఇందులో బాలీవుడ్ హీరో అజయ్దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు సంబంధించిన కీలక ఎపిసోడ్లని రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. అజయ్ ఈ చిత్రంలో బ్రిటీష్ అధికారిగా కనిపిస్తారని చెబుతున్నారు. ఆయనకు జోడీగా శ్రియ నటించనున్నట్లు తాజా సమాచారం. అదే నిజమైతే శ్రియ బంపర్ ఆఫర్ కొట్టేసినట్టేనని వార్తలు షికారు చేస్తున్నాయి.