హైదరాబాద్లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండగా సినీ తారలు బయటికి రావడానికి, షూటింగ్లకు వెళ్లడానికి భయపడుతున్న వేళ హీరో శ్రీకాంత్ ఏకంగా సిద్ధిపేటలో సందడి చేయడం ఆసక్తికరంగా మారింది. సిద్ధిపేట జిల్లాలోని మిరుదొడ్డి మండలం మోతే గ్రామానికి వెళ్లిన హీరో శ్రీకాంత్ ఆ గ్రామంలో వున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆకస్మికంగా హీరో శ్రీకాంత్ రాకతో మోతే గ్రామంలో సందడి నెలకొంది. ఆయనతో గ్రామంలోని వారంతా పోటీ పడి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ `మారుమూల గ్రామమైన మోతేలో ఇలాంటి విశిష్టమైన ఆలయం వుండటం విశేషమన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై అంతా జాగ్రత్తగా వుండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. హైదరాబాద్లో కరోనా విజృంభిస్తున్నా ఇక్కడి పల్లెల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదని, ఇక్కడి వారు తీసుకుంటున్న జాగ్రత్తల కారణంగానే వైరస్ సోకడం లేదన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. స్వీయనియంత్రనే ఏకైక మార్గమని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు విజ్ఞప్లి చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ని మోతె గ్రామ సర్పంచ్ శాలువాతో సత్కరించారు.