దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1996లో వచ్చిన రొమాంటిక్ మ్యూజికల్ లవ్స్టోరీ `పెళ్లి సందడి“`. శ్రీకాంత్, రవళి, దీప్తీ భట్నాగర్ హీరోహీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతంలో సి.అశ్వనీదత్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంహీరో శ్రీకాంత్ కెరీర్ని ఓ మలుపు తిప్పింది. కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రాన్ని ఎక్కడో నిలబెట్టింది.
ఎవర్గ్రీన్ మ్యూజికల్ హిట్గా నిలిచిన ఈ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందనున్న ఈ సీక్వెల్లో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించబోతున్నాడు. `పెళ్లిసందD` పేరుతో రూపొందనున్నఈ మూవీ ద్వరా హీరోయిన్గా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు ఖుషీకపూర్ని పరిచయం చేయాలని భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతకు ముందే ఇందులో హీరోయిన్గా మలయాళీ బ్యూటీ మాళవిక నయర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఖుషీ కపూర్ని ఈ మూవీ ద్వారా వెండితెరకు పరిచయం చేయబోతున్నారట. ఆర్కా మీడియా సమర్పణలో కె. రాఘవేంద్రరావు సోదరుడు కె. కృష్ణమోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మించయనున్నట్టు తెలిసింది.