సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు నుండి టీజర్ విడుదలై రికార్డులు తిరగరాస్తోంది. ఈ టీజర్ లో హీరోయిన్ రష్మిక లేకపోవడం పట్ల ఆమె ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. రష్మికను టీజర్ లో పెట్టలేదంటే ఇందులో ఆమెది నామమాత్రపు రోల్ ఏమో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. అసలు ఏదో హీరోయిన్ ఉండాలి అన్నట్లుగా హీరోయిన్ పాత్ర పెట్టారా ఏంటి అని ఆందోళన చెందుతున్నారు. స్వతహాగా మంచి పెర్ఫార్మర్ అయిన రష్మికను పెద్ద సినిమాలో తీసుకుంటే ఫ్యాన్స్ అందరూ సంతోషించారు కానీ ఇప్పుడు టీజర్ లో లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరో సినిమాల్లో హీరోయిన్స్ ను చూపించడం ఉండదు. కానీ కేవలం హీరో ఒక్కడినే చూపిస్తే ఎటువంటి ఆందోళన ఉండేది కాదు కానీ ఈ టీజర్ లో హీరోతో పాటు విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ లను చూపించారు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ లకు డైలాగులు కూడా పెట్టారు. దీంతో వాళ్లకున్న ప్రాధాన్యత కూడా మా హీరోయిన్ కు లేదా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
అయితే రష్మిక ఫ్యాన్స్ భయపడటానికంటూ ఏం లేదట. ఇందులో రష్మిక పాత్ర చాలా చిలిపిగా, అల్లరిగా ఉంటుందని తెలుస్తోంది. ఆమె పాత్ర చాలా లైవ్లీగా ఉంటుందిట. మెయిన్ కథకు నిజంగానే సంబంధం లేకపోయినా ఏదో నామ మాత్రపు పాత్ర అయితే కాదని అంటున్నారు. ఇక టీజర్ లో ఆమె పాత్రను పెట్టకపోవడానికి కారణం రష్మిక కోసం స్పెషల్ గా మరో టీజర్ ను రెడీ చేస్తున్నారట. కేవలం ఆమె పాత్రను పరిచయం చేస్తూ, హీరోతో పలికే ఒక క్యూట్ సంబాషణతో ఆ టీజర్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. దీంతో రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారని తెలుస్తోంది. రష్మికకు తెలుగులో కంటే కన్నడలో ఫ్యాన్స్ బానే ఉన్నారు. తెలుగులో స్టార్ హీరో సినిమాలో చేస్తోంది అనగానే వారంతా ఆసక్తిగా సరిలేరు నీకెవ్వరు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ టీజర్ ను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ నుండి మొదలుపెట్టి వారానికి ఒక వీడియో అప్డేట్, లేదా సాంగ్ అలా ఏదొక ప్రమోషనల్ స్టఫ్ ఉండేలా ఆల్రెడీ ప్లాన్ చేసారు. న్యూ ఇయర్ కు ట్రైలర్ ను విడుదల చేసి తర్వాత జనవరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని భావిస్తున్నారు. ఇలా అయితే ప్రమోషన్ గట్టిగా ఉంటుందన్నది వారి భావన.
సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న విడుదల కానున్న సంగతి తెల్సిందే. మహేష్ బాబు ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ రోల్ లో కనిపించనున్న విషయం తెల్సిందే. కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దిల్ రాజు సమర్పిస్తున్నాడు.