ఈ సంక్రాంతి భారీ చిత్రాల సందడి అప్పుడే మొదలైంది. ఈ రేసులో ముందుగా రిలీజ్ అయినా సూపర్స్టార్ రజనీ చిత్రం తొలి షోతోనే మంచి టాక్ని సొంతం చేసుకుంది. దీంతో ప్రేక్షకుల దృష్టి రాబోతున్న రెండు క్రేజీ చిత్రాలనై పడింది. ఇందులో సూపర్స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` ఈ నెల 11న విడుదల కాబోతోంది. `ఎఫ్2`తో మంచి జోష్మీదున్నఅనిల్ రావిపూడి అదే ఫన్ని కంటిన్యూ చేస్తూ దానికి ఎమోషన్ని, సందేశాన్ని జోడించి `సరిలేరు నీకెవ్వరు` చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
ఇటీవల ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా రిలీజ్ చేసిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్తో సినిమాపై అంచనాలు పెరిగిపోయయి. దీని తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న `అల వైకుంఠపురములో` ఈ నెల 12న రిలీజ్ కాబోతోంది. మ్యూజిక్ ఆల్బమ్తో పాటు థియేట్రికల్ ట్రైలర్తో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ రేసులో ముందు వరుసలో నిలుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుండగా మహేష్, బన్నీ ఫ్యాన్స్కి గుడ్న్యూస్ వచ్చేసింది.
11న రిలీజ్ అవుతున్న `సరిలేరు నీకెవ్వరు` చిత్రాన్ని, 12న రానున్న `అల వైకుంఠపురములో` చిత్రాల్ని 17వ తేదీ వరకు తెల్లవారు జామున 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు రెండు ప్రత్యేక షోలు వేసుకునే వెసులు బాటును ఏపీ ప్రభుత్వం కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో దిల్ రాజుకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర ఫిలింస్కు ఉదయం 7 గంటల షోలు ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో అటు మహేష్ ఫ్యాన్స్తో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారట.