రియల్ హీరో సోనుసూద్ ట్యాంక్ బండ్ని సందర్శించారు. లాక్డౌన్ సందర్భంగా తన సేవా నిరతిని ప్రదర్శించి సోను సూద్ దేశ వ్యాప్తంగా రియల్ హీరో అయ్యారు. ఆయనని అభిమానించని వారు లేరంటే అది అతిశయోక్తి కాదేమో. సోనుసూద్ కు శవాల శివ కూడా వీరాభిమాని అయ్యారు. ట్యాంక్ బండ్పై ప్రమాద వశాత్తు మరణించిన, ఆత్మ హత్యలు చేసుకున్న వారి శవాలని హుస్సేన్ సాగర్ నుంచి వెలికి తీయడంలో శవాల శివ ప్రజల హృదయాల్లో నిలిచారు.
అతన్ని సోనుసూద్ తాజాగా ట్యాంక్ బండ్పై కలిసి అబినందించారు. ప్రజలు వివిధ రూపాల్లో అందజేసిన నగదుతో శవాల శివ అంబులెన్స్ని కొనుగోలు చేసి దీనికి `సోనుసూద్ అంబులెన్స్` అని పేరు పెట్టాడు. ఈ అంబులెన్స్ని సోనుసూద్ చేతుల మీదుగా ప్రారంభించాలని శివ అనుకుని ఆయనకు విషయాన్ని చేరవేశారట. విషయం తెలిసిన సోనుసూద్ ట్యాంక్ బండ్ చేరుకున్నారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్తో కలిసి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజాలు చేశారు.
అనంతరం అంబులెన్స్ సేవల్ని ప్రారంభించారు. సమాజానికి అంకిత భావంతో సేవలందిస్తున్న శివను సోనుసూద్ ప్రత్యేకంగా అభినందించారు. శివని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది యువకులు సమాజ సేవ కోసం ముందుకు రావాల్సిన అవసరం వుందని ఈ సందర్భంగా సోనుసూద్ అన్నారు. విపత్కర సమయంలో సేవలందించిన తన పట్ల ప్రజలు నమ్మకం, విశ్వాసంతో వున్నారని సంతోషం వ్యక్తం చేశారు.