లాక్డౌన్ సమయంలో పలువురికి సాయంగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు నటుడు సోనుసూద్. సేవా కార్యక్రమాలతో ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ఇదిలా వుంటే సోనుసూద్ రాజకీయాల్లోకి వెళుతున్నారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. దానికి కారణంగా ఆయన బుధవారం మహారాష్ట్ర నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ని ప్రత్యేకంగా కలిశారు.
ముంబైలోని శరద్ పవార్ నివాసానికి వెళ్లిన సోనుసూద్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఏ అంశంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగిందన్నది మాత్రం ఇంత వరకు స్పష్టత రాలేదు. ఇదిలా వుంటే బృహన్ ముంబై కార్పొరేషన్ సోనుసూద్పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా జుహూ ప్రాంతంలో వున్న తన ఆరంతస్తుల భవనాన్ని హోటల్గా మార్చారని ఆరోపణలు చేస్తూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కేసు పెట్టింది. అంతే కాకుండా అతని పాత నేరస్తుడంటూ సంలచన ఆరోపణలు చేసింది.
ఈ ఆరోపణలపై సోనుసూద్ ఘాటుగా స్పందించారు. హోటల్ మార్పుకు అన్ని రకాల అనుమతులు తీసుకున్నానని, బీఎంసీ తీరుపై ముంబై హైకోర్టుని ఆశ్రయించారు. తాజా వివాదం కారణంగానే సోను .. శరద్ పవార్ని కలిసి వుంటారని ఊహాగానాలు వనిపిస్తున్నాయి. తాజా వివాదంపై ముంబై హై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.