క్రేజీ సింగర్ సునీత త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. మొదటి భర్త కిరణ్తో విడిపోయిన ఆమె గత కొంత కాలంగా పిల్లలతో కలిసి ఒంటరి జీవితాన్ని సాగిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు అండ వుండాలని శ్రేయోభిలాషుల కోరిక మేరకు రెండవ పెళ్లికి సిద్ధమైన సునీత గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల సునీత `మ్యాంగో` అధినేత రామ్ సూరపనేనిని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇద్దరికి ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తన పిల్లలు, తల్లిదండ్రుల అనుమతితోనే తన ఎంగేజ్మెంట్ జరిగిందని, అందుకు సంబంధించిన ఫొటోలని సునీత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. త్వరలోనే తామిద్దరం వివాహం చేసుకోబోతున్నామని, ఆ విషయాన్ని స్వయంగా తానే వెల్లడిస్తానని ప్రకటించింది. సునీత, రామ్ల వివాహం ఈ నెల 27న గ్రాండ్గా హైదరాబాద్లో జరగబోతోందని ప్రచారం మొదలైంది.
అయితే ఈ ప్రచారంపై సునీత తాజాగా స్పందించారు. తన పెళ్లి గురించి ఎవరికి నచ్చిన డేట్ని వారు రాయకండని, పెళ్లి డేట్ని తానే స్వయంగా వెల్లడిస్తానని, అంత వరకు వెయిట్ చేయండని స్పష్టం చేసింది. గురువారం రాత్రి దిల్రాజు ఇచ్చిన బర్త్డే పార్టీలో సునీత తనకు కాబోయే భర్త రామ్తో కలిసి సందడి చేసింది.