వరుణ్ సందేశ్ హీరోగా నటించిన `కొత్త బంగారు లోకం` చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు ప్రసాద్. తొలి చిత్రంతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన శ్వేత అందరి దృష్టిని ఆకర్షించింది. ఎక్కడా.. అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఆ తరువాత శ్వేతకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.
దాంతో తెలుగులో కనిపించకుండా పోయింది. ఐటమ్ సాంగుల్లో సైతం ఆకట్టుకోవాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. ఇదే క్రమంలో వ్యక్తగత జీవితం అదుపు తప్పింది. దాంతో స్నేహితుడైన డైరెక్టర్ రోహిత్ మిట్టల్ని 2018లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లైన ఎనిమిది నెలలకే ఈ ఇద్దరూ విడిపోయారు.
అయితే తాజాగా తన విడాకుల గురించి వెల్లడించింది. ఇద్దరం ఒకరినొకరం అనుకునే విడాకులు తీసుకున్నామని, అయితే అది తనకు బ్రేకప్లానే వుందని చెప్పుకొచ్చింది. ఎనిమిది నెలల తరువాత విడిపోయాం కాబట్టి విడాకులనే పెద్ద పదంతో పోల్చడం తనకు ఇష్టం లేదని చెబుతోంది. రోహిత్తో విడిపోయిన తరువాత చాలా బాధను నుభవించానని చెబుతున్న శ్వేతా బసూ ప్రసాద్ ప్రస్తుతం వెబ్ సిరీస్లతో పాటు హిందీ సీరియల్స్లో నటిస్తోంది.