`కొత్త బంగారు లోకం` సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు నటి శ్వేతా బసు ప్రసాద్. తొలి చిత్రంతోనే తనదైన నటనను ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రని వేసుకున్నారామె. ఆ తరువాత తెలుగులో రాణించాలని ప్రయత్నించినా వ్యక్తిగత కారణాల వల్ల ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. దీంతో బాలీవుడ్ వెళ్లి బుల్లి తెరని నమ్ముకున్నా ఫలితం లేకుండా పోయింది.
గత కొంత కాలంగా ప్రేమలో వున్న శ్వేతాబసు ప్రసాద్ 2018లో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఏడాది తిరక్కుండానే ఈ ఇద్దరు విడాకుల కోసం గత ఏడాది డిసెంబర్లో అప్లై చేయడం కలకలం రేపింది. తాజాగా తన విడాకులపై శ్వేత స్పందించింది. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, విడిపోయినా రోహిత్, తాను మిత్రులుగా కొనసాగుతామని చెప్పుకొచ్చింది.
అయితే మళ్లీ తాను ప్రేమలో పడననే గ్యారంటీ ఏమీ లేదని, నచ్చిన వ్యక్తితో తాను ప్రేమలో పడొచ్చిని, కానీ ప్రస్తుతం మాత్రం తనకు ప్రేమలో పడేంత సమయం లేదని, కెరీర్పైనే దృష్టిపెట్టానని చెబుతోంది. తెలుగులో అవకాశాలు లేని శ్వేతా బసు ప్రసాద్ వెబ్ సిరీస్లలో నటించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఆఫర్లు లభిస్తే శ్వేత కెరీర్ నల్లేరు మీద నడకే అవుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.