ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య వివాదంలో చారిత్రాత్మకమైన తీర్పును ప్రకటించిన భారత అత్యున్నత న్యాయస్థానం, నేడు దేశవ్యాప్తంగా ప్రజలు చర్చించుకున్న మరియు సంచలనమైన మరో రెండు అంశాలపై కూడా తన తీర్పును వెలువరించనుంది. వాటిలో ఒకటి గత సంవత్సరం ఎంతో వివాదాస్పదమైన శబరిమల దేవాలయం లోకి మహిళల ప్రవేశం పై కాగా, మరొకటి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని గత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ గారి నేతృత్వంలో ధర్మాసనం ఈ మూడు కీలక అంశాలపై కూడా తీర్పు వెలువరించనుంది. వీటితోపాటు రాఫెల్ అంశం తీర్పుపై ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు దాఖలు చేసిన పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతోంది.
ఈ అంశాలను ఒక్కసారి మనం గమనిస్తే,
1. శబరిమల లో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలోకి ఆలయ నియమ నిబంధనలను అనుసరించి, రుతుక్రమంలో అనగా 10 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్త్రీల ప్రవేశంపై ఆంక్ష ఉంది. అయితే 2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలను అనుమతించాలని తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుని మళ్ళీ ఒకసారి పున: సమీక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా అనేక రివ్యూ పిటిషన్లు దాఖలు అయిన నేపథ్యంలో, భారత అత్యున్నత న్యాయస్థానం వీటిపై విచారణ జరిపి ఫిబ్రవరి 6వ తేదీన తన తీర్పును రిజర్వులో ఉంచింది.
2. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన వివాదానికి వస్తే, 2018 డిసెంబర్ 14న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మరియు మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు, మే 10న రిజర్వులో తన తీర్పును పెట్టింది.
అదే విధంగా
౩. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని ధిక్కరించే విధంగా, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి “చౌకీదార్ చోర్ హై” అని పదే పదే ప్రచారం చేసి, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించిన నేపథ్యంలో, ఆయనపై దాఖలైన పిటిషన్ పై కూడా సుప్రీం కోర్టు ధర్మాసనం నేడు తీర్పు వెలువరించనుంది.