కరోనా మహమ్మారి కారణంగా దేశంలో రోజు రోజుకీ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కోవిడ్ సెకండ్ వేవ్ మృత్యుగంటికలు మోగిస్తోంది. మరీ ముఖ్యంగా సినీ రంగంపై దీని ప్రభావం తీవ్రంగానే వున్నట్టుగా కనిపిస్తోంది. వరుసగా సినీ రంగానికి చెందిన వాళ్లలో కొంత మంది కోవిడ్ కారణంగా వరుసగా మరణిస్తున్నారు.
తాజాగా ప్రముఖ సీనియర్ సింగర్ జి. ఆనంద్ (67) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కరోనా సోకడంతో చికిత్స పొందుతున్న సింగర్ జి. ఆనంద్ పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. వెంటిలేటర్ కోసం ఎదురుచూసిన ఆయనకు ఎలాంటి సపోర్ట్ లభించకపోవడంతో ఆయన చివరికి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఇండస్ట్రీ వర్గాలు, మెగాస్టార్ చిరంజీవీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
`ఒక వేణువు వినిపించెను.. (అమెరికా అమ్మాయి), దిక్కులు చూడకు రామయ్య.. విఠల విఠలా పాండురంగ విఠలా.. చిరంజీవి నటించిన `ప్రాణం ఖరీదు`, కృష్ణ నటించిన `పండంటి కాపురం` వంటి తదితర చిత్రాలకు పాటలు పాడారు జి. ఆనంద్. `గాంధీ నగర్ రెండవ వీధి`, రంగవల్లి వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.