శేఖర్ కమ్ముల ఎక్కువగా కొత్తవాళ్లతో పనిచేయడానికి ఇష్టపడతాడు. అలాంటిది ఫిదా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ఈ చిత్రం కొద్దిరోజుల క్రితం పట్టాలెక్కింది.
నిజానికి ఈ సినిమాకంటే ముందు శేఖర్ కమ్ముల ఇదే స్టోరీతో కొత్తవాళ్లతో సినిమా షూటింగ్ చేసాడు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న సమయంలో ప్రోడక్ట్ నచ్చని కమ్ముల ఆ ప్రాజెక్ట్ ఆపేసి దాదాపు అదే స్టోరీతో నాగ చైతన్యతో తీస్తున్నాడు.
ఇటీవలే ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ ఈ సినిమాలో తెలంగాణ యాసలోనే మాట్లాడతారని చెప్పారు. అయితే ఫిదా తరహాలో కాకుండా సాయి పల్లవి పాత్ర ఈ చిత్రంలో మరింత గమ్మత్తుగా ఉంటుందని తెలుస్తోంది. నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ పల్లెటూరు నుండి పట్నం వచ్చే పాత్రల్లో కనిపిస్తారని చెప్పాడు శేఖర్ కమ్ముల.