`సరిలేరు నీకెవ్వరు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`. . మహేష్ 27వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని యువ దర్శకుడు పరశురామ్ తెరకెక్కించబోతున్నాడు. మైత్రీ మూవీమేకర్స్, 14 ప్లస్ రీల్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సూపర్స్టార్ కృష్ణ పుట్టిన రోజున ఈ చిత్రాన్ని అధికారికంగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై సంధిస్తున్న వ్యగ్యాస్త్రంగా ఈ చిత్ర కథ సాగుతుందని చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్పై తాజా వార్త ఒకటి బయటికి వచ్చింది. కరోనా ప్రభావం నానాటికీ పెరుగుతున్నా చేసేది లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్లో సడలింపులు ఇవ్వడంతో సినిమా షూటింగ్లు ఈ నెల రెండవ వారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో `సర్కారు వారి పాట` చిత్రాన్ని కూడా మేకర్స్ ప్రారంభించబోతున్నారట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మూడు నెలల తరువాత మార్పులు వచ్చే అవకాశం వుండటంతో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ రెండవ వారం నుంచి ప్రారంభించాలని హీరోతో పాటు మేకర్స్ భావిస్తున్నారట. ఇందు కోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇందులో మహేష్కు జోడీగా కియారా లేదా సాయీ ముఖర్జీ నటించే అవకాశం వుందని తెలుస్తోంది.