సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మహేష్, విజయశాంతి తదితరులు పాల్గొంటున్న షాట్స్ కొన్ని చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారానికి షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా ప్లాన్ చేసారు. మరోవైపు ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో ప్లాన్ చేసారు. ఇప్పటికే టీజర్ తో రికార్డులను తిరగరాసిన విషయం తెల్సిందే. అప్పటిదాకా పెద్దగా ఊపందుకోని ప్రమోషన్స్ టీజర్ తో ఒక్కసారిగా దూసుకువెళ్లాయి. ఇక వచ్చిన ఊపుని తగ్గించడం ఇష్టం లేక సరిలేరు నీకెవ్వరు టీమ్ వరసగా ప్రమోషనల్ మెటీరియల్ దించడానికి సిద్ధమైంది. మాస్ ఎంబీ మండేస్ పేరుతో ఈ డిసెంబర్ మొత్తం ప్రతి సోమవారం సరిలేరు నీకెవ్వరు నుండి ఒక్కో పాట విడుదల చేయబోతోంది. ముందుగా ఈరోజు సాయంత్రం 5:04 నిమిషాలకు ఈ సినిమాలోని మొదటి పాట మైండ్ బ్లాక్ ను దించబోతున్నారు.
మైండ్ బ్లాక్ అనేది మహేష్ ఫ్యాన్స్ కు సరిగ్గా కనెక్ట్ అయ్యే పదం. పోకిరిలో మైండ్ బ్లాక్ డైలాగ్ ను ఎవరూ త్వరగా మర్చిపోలేరు. ఈ నేపథ్యంలో అదే పదం మీద పాట వస్తుండడం నిజంగా విశేషమే. ఇక సరిలేరు నీకెవ్వరుకి మొదటి నుండి పాటిస్తున్నట్టు 9 సెంటిమెంట్ ను దీనికి కూడా పాటిస్తున్నారు. 5 గంటల 4 నిముషాలు కలిపితే 9 వస్తుందన్న విషయం తెల్సిందే. టీజర్ కు కూడా ఇదే సెంటిమెంట్ వాడారు. చివరికి ఏదైనా అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నా కూడా ఇదే సెంటిమెంట్ ను వాడుతున్నారు. ఏదేమైనా డిసెంబర్ మొత్తం సరిలేరు పాటల సందడి ఉండనుండడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ట్విట్టర్ లో రకరకాలుగా సినిమాను నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేస్తున్నారు. మైండ్ బ్లాక్ సాంగ్ గురించి ప్రకటించిన కొద్ది సేపటి తర్వాత నేషనల్ లెవెల్లో ఫస్ట్ 4 ట్రెండ్స్ సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించిందే కావడం గమనార్హం. ఈ విషయం తెలియజేస్తూ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. ప్రస్తుతం దేవి కొంచెం డౌన్ లో ఉన్నాడనే చెప్పాలి. ఒకవైపు థమన్ దూసుకుపోతుంటే దేవి శ్రీ ప్రసాద్ కు మాత్రం నిరూపించుకోవడానికి పెద్దగా అవకాశాలు రాలేదు.
ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు రూపంలో తనకి బెస్ట్ ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో పాటలతో కనుక అదరగొడితే ఇక దేవికి మళ్ళీ తెలుగులో తిరుగుండదు. అందుకే ఇదే తనకి బెస్ట్ ఛాన్స్ అని నమ్ముతున్నాడు దేవి. సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సందర్భముగా జనవరి 11న విడుదలవుతుందన్న సంగతి తెల్సిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో తమన్నా అతిధి పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకుడు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దిల్ రాజు సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.