తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ మలి విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్ యమ జోరుగా సాగుతోంది. ప్రభాస్ నుంచి జబర్దస్త్ టీమ్ వరకు భారీ స్థాయిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటూ మొక్కలు నాటుతున్నారు. పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా దర్శకుడు సంపత్ నంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
ప్రముఖ టెలివిజన్ యాంకర్ ఉదయభాను విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని స్వీకరించిన సంపత్ నంది తన భార్య, పిల్లలతో కలిసి చిలుకూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని సూచించారు. సంతోష్ అన్న ప్రారంభించిన ఈ కార్యక్రమంలో తాను ఓ భాగం అయినందుకు ఆనందంగా వుందన్నారు. పద్మశ్రీ కోటి మొక్కల రామయ్య గురించి విన్నప్పుడు ఒక్క మనిషి ఇన్ని మొక్కలు ఎలా నాటారని ఆశ్చర్యంగా అనిపించింది. ఆతరువాత కర్ణాటక రాష్ట్రానికి చెందిన తిమ్మక్క హైవేపే నాలుగు కిలోమీటర్ల మేర మొక్కలు నాటారంటే ఆశ్చర్యమనిపించిందన్నారు.
సంతోషన్న కోటి మొక్కలకు దగ్గరవుతున్నారు. తప్పకుండా ఆయనకు మిగతా వారిని మించి గౌరవం దక్కాలని కోరుకుంటున్నాను. పచ్చదనాన్ని, ప్రకృతిని కాపాడుకోలేకపోతే ఇప్పుడు మనం ముఖానికి మాస్కులు వేసుకుని తిరుగుతున్నాం.. రేపు వీపుకు ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని తిరగాల్సి వస్తుంది` అని హెచ్చరించారు.