టాలీవుడ్, కోలీవుడ్లలో సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె ఏ సినిమా చేస్తే అది బంపర్ హిట్టే. పెళ్లి తరువాత నుంచి సినిమాల ఎంపికలో పంథా మార్చిన సమంత పారితోషికం మాత్రం ఏ మాత్రం తగ్గించలేదు. భారీగానే వసూలు చేస్తోంది. ఇటీవల సామ్ నటించిన `జాను` ఫ్లాప్ కావడం, కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సమంత కొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిసింది.
`జాను` తరువాత కొంత సైలెంట్ అయిన సమంత ఇటీవలే మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్గా వుంటోంది. తాజాగా రెండు భారీ చిత్రాల్ని సమంత అంగీకరించిన విషయం తెలిసిందే. సోనీ పిక్చర్స్ నిర్మించనున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాతో పాటు నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ రూపొందించనున్న ద్విభాషా చిత్రాన్ని కూడా అంగీకరించింది. ఇందులో నయనతార కూడా నటించనుంది. ఈ రెండు మహిళా ప్రధాన చిత్రాలే.
అయితే విగ్నేష్ శివన్ తెరకెక్కించనున్న చిత్రాన్ని కోవిడ్ నేపథ్యంలో అత్యంత తక్కువ బడ్జెట్తో నిర్మించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ఇందు కోసం సమంత తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్టు తెలిసింది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. `నా నుమ్ రౌడీదాన్` చిత్రం తరువాత నయనతారతో విగ్నేష్ శివన్ రూపొందించనున్న సినిమా ఇది.