తమిళ హీరో సూర్య గత కొంత కాలంగా సినిమాల్లో నటిస్తూనే అలా వచ్చిన డబ్బుతో తమిళనాడు చుట్టుపక్కల గ్రామాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమవుతున్న పిల్లల్ని చేరదీసి అగరం ఫౌండేషన్ ద్వారా వారికి ఉన్నత విద్యను అందిస్తున్నారు. గత పదేళ్లుగా ఆయన ఈ సేవ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
తాజాగా ఆయన తరహాలోనే స్టార్ హీరోయిన్ సమంత కూడా ఓ విద్యా సంస్థని స్థాపించబోతోంది. ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఓ ఎన్జీఓని స్థాపించి గత కొన్నేళ్లుగా సేవలు చేస్తున్నారామె. ఆ మధ్య హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించి తన గొప్ప మనసును చాటుకున్న సమంత తాజాగా ఎడ్యుకేషన్ రంగంలోకి ప్రవేశిస్తుండటం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
ఏకం పేరుతో ఈ సంస్థని తన స్నేహితులతో కలిసి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఏరియాలో స్థాపించబోతోంది. ఇందు కోసం స్థలాన్ని కూడా పరిశీలించారని. త్వరలోనే అన్ని అనుమతుల్ని పొంది విద్యాసంస్థని లాంఛనంగా ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఆమె సన్నిహితుల సమాచారం. సమంత ప్రస్తుతం `జాన్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.