కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ చేయడానికి చాలా మంది క్రేజీ స్టార్స్ భయపడుతున్న వేళ ఇది. ఒక వేళ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సెట్స్కి వెళ్లినా సీరియల్ యాక్టర్స్కి కరోనా సోకిన వియం తెలిసిందే. దీంతో స్టార్ హీరోలు, హీరోయిన్లు షూటింగ్స్ చేయడానికి భయపడుతున్నారు. అయితే అక్కినేని వారు మాత్రం భయపడటం లేదు. ఇటీవలే కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో కోసం సెట్లో సందడి చేసిన విషయం తెలిసిందే.
కోవిడ్ నిబంధనలని పాటిస్తూ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో షూట్లో పాల్గొన్నారు. ఇదిలా వుంటే మామ తరహాలోనే అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంత సెట్లో అడుగుపెట్టింది. దాదాపు 6 నెలల విరామం తరువాత సామ్ కెమెరా ముందుకు వచ్చింది. అయితే అది సినిమా కోసం మాత్రం కాదు. ఓ కమర్షియల్ యాడ్ కోసం. రెండు రోజుల పాటు సాగే కమర్షియల్ యాడ్ ఫిల్మ్ షూటింగ్లో సమంత పాల్గొనబోతోంది. కోవిడ్ నిబంధనలను అనుసరించి జాగ్రత్తల మధ్య ఈ యాడ్ ఫిల్మ్ని షూట్ చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో `జాను` సినిమా సమంతను నిరాశ పరిచింది. దీంతో కొంత విరామం తీసుకోవాలని భావించింది. కరోనా వైరస్ కారణంగా దాదాపు 6 నెలల విరామం తీసుకోవాల్సి వచ్చింది. త్వరలో `గేమ్ ఓవర్` ఫేమ్ అశ్విన్ శరవణన్ తో ఓ చిత్రం , నయనతార బాయ్ఫ్రెండ్ విగ్నేష్ శివన్తో ఓ సినిమా చేయబోతోంది. ఇందులో అశ్విన్ శరవణన్ తో చేయబోతున్న చిత్రం మహిళా ప్రధాన చిత్రం. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారు.