దక్షిణాదిలో సక్సెస్ అయ్యాక ఉత్తరాదికి అంటే బాలీవుడ్కి వెళ్లడం గత కొంత కాలంగా ఉత్తరాది భామలు ఫాలో అవుతున్న ట్రెండ్. అయితే అది ఒకప్పటి మాట. `బాహుబలి` తరువాత ట్రెండు మారింది. తెలుగు సినిమాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఇక్కడ చిన్న సినిమా వస్తోందంటే యావత్ దేశం మొత్తం తెలుగు సినిమావైపే ఆసక్తిగా చూస్తోంది. దాంతో హీరోయిన్ల ప్రాదమ్యాలు కూడా మారిపోతున్నాయి. దక్షిణాదిలో నిరూపించుకున్నాక ఉత్తరాదికి వెళ్లాలని భావించే భామలు ఇప్పుడు మనసు మార్చుకుని దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
తాజాగా ఈ జాబితాలో దబాంగ్ పాప సయీ మంజ్రేకర్ చేరింది. సల్మాన్ఖాన్ నటించిన థర్డ్ ఇన్స్టాల్మెంట్ `దబాంగ్ 3`. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాక్షిసిన్హాతో పాటు సయీ మంజ్రేకర్ కూడా ఓ హీరోయిన్గా నటించింది. ఇదే ఆమె తొలి చిత్రం. నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ ముద్దుల కూతురు సయీ మంజ్నేకర్ ఈ చిత్రంతోనే హీరోయిన్గా బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. తొలి సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందించలేకపోయినా తనకి టాలీవుడ్ అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
`గద్దలకొండ గణేష్` తరువాత మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ యంగ్ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సర్గా కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని సిద్దు ముద్దాతో కలిసి అల్లు అరవింద్ పెద్దకుమారుడు అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. ఇందులో వరుణ్తేజ్ సరసనిద్దరు కథానాయికలు నటించనున్నారట. అయితే అందులో ఓ నాయికగా `దబాంగ్ 3` ఫేమ్ సయీ మంజ్రేకర్ని మేకర్స్ ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. ఈ సినిమాతో సయీ టాలీవుడ్లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోందట.