అడివి మార్గాన ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుని వుంది? ఎవరి కోసం ఆమె నిరీక్షణ? ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్న అక్షరాలేమిటి? ఆమె పక్కనున్న బ్యాగులో ఉన్నవేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు విడుదల తర్వాతే` అంటున్నారు దర్శకుడు వేణు ఊడుగుల పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం `విరాటపర్వం`.
రానా దగ్గుబాటి హీరోగా సాయిపల్లవి హీరోయిగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటి నందితాదాస్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. టాలెంటెడ్ నటి సాయిపల్లవి పుట్టిన రోజు నేడు (మే 9). ఈ సందర్భంగా సాయి పల్లవికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని ఈ రోజు దర్శకుడు రిలీజ్ చేశారు. 1990 లో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
డి. సురేష్బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నక్సలిజానికి ఓ ప్రేమ జంటకు మధ్య సాగే రసవత్తర కథ, కథనాలతో ఉత్తర తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి చిత్రంతోనే `నీది నాది ఒకే కథ` అంటూ ఆలోచింపజేసిన వేణు ఊడుగుల ఈ చిత్రం ద్వారా ఓ సమకాలీన సామాజిక అంశాన్ని చర్చిస్తూనే ఓ హృద్యమైన ప్రేమకథని చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి జనపద గాయనిగా కనిపించబోతోంది.