అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కన్నడ సోయగం రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇటీవలే మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్లో పీటర్ హెయిన్స్ నేతృత్యంలో కీలక పోరాట ఘట్టాలని షూట్ చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. విలన్గా తమిళ హీరో ఆర్య, కన్నడ నటుడు ధనుంజయ నటిస్తున్నారు. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని 80వ దశకం నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర వుందట.. అది హీరో అల్లు అర్జున్ సోదరి పాత్ర అని తెలిసింది.
ఈ పాత్ర కోసం క్రేజీ హీరోయిన్ సాయి పల్లవిని చిత్ర బృందం సంప్రదిస్తున్నారట. కథకు కీలకమైన పాత్ర కావడంతో ఈ పాత్రకు సాయి పల్లవి అయితే బాగుంటుందని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నారట. ఆ కారణంగానే సాయి పల్లవిని సంప్రదిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సాయి పల్లవి ఈ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.