టాలీవుడ్లో ఏ నోట విన్నా ఒకటే మాట సాయి పల్లవి. మలయాళ చిత్రం `ప్రేమమ్`తో మలర్గా అక్కడి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన `ఫిదా ` చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని 50 కోట్ల క్లబ్లో చేరి తెలుగు ఆడియన్స్ని ఫిదా చేసేసింది.
ఈ సమ్మర్కి రెండు చిత్రాలతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. సాయి పల్లవి నటిస్తున్న రెండు చిత్రాలు `లవ్ స్టోరీ`. విరాట పర్వం. విచిత్రం ఏంటంటే ఈ రెండు చిత్రాల్లోనూ తెలంగాణ యువతిగా సాయి పల్లవి తనదైన నటనతో మెస్మరైజ్ చేయబోతోంది. `లవ్స్టోరీ` చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే యూట్యూబ్లో రికార్డు సృష్టిస్తున్నాయి.
అ చిత్రంలోని `సారంగ దరియా ` ఇప్పటికే తెలుగు టాప్ హిట్ సాంగ్లలో అత్యధిక వ్యూస్ని సాధించిన పాటగా మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రానాతో నటిస్తున్న `విరాటపర్వం`లోనూ సాయి పల్లవి ఛాలెంజింగ్ పాత్రలో ఫోక్ సింగర్గా కనిపించబోతోంది. నక్సలైట్ ఉద్యమ నాయకుడి ప్రేమ కోసం అతన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లే యువతిగా సాయి పల్లవి పాత్ర సరికొత్తగా వుండబోతోంది. ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కాబోతోంది. దీనిపై కూడా అంచనాలు భారీగానే వున్నాయి. ఈ రెండు సినిమాలు సాయి పల్లవి అభిమానులని సర్ప్రైజ్ చేయడం ఖాయం అని చెబుతున్నారు.