కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం కకావికలం అవుతోంది. దీన్ని అరికట్టాలంటే నివారణ అండ్ సోషల్ డిస్టెన్సీ ఒక్కడే మార్గమని బలంగా నమ్మిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. చేస్తూనే వున్నాయి. దీని కోసం విధి నిర్వహణలో డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది తమ వంతు బాధ్యతగా ముందుండి దేశానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
సినీ తారలు కూడా మేము సైతం అంటూ తమ వంతు బాధ్యతగా కరోనా పట్ల ప్రజలని అప్పమత్తం చేస్తున్నారు. పలు స్లోగన్లిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. పాటలతో కూడా ఆకట్టుకుంటూ ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో ప్రజలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ కూడా తన వంతు బాధ్యతగా ముందుకొచ్చారు. కార్మికుల సంక్షేమానికి 5 లక్షలు, డబ్బింగ్ యూనియన్కు 2 లక్షలు విరాళం అందించారు.
ఇక్కడితో తన బాధ్యత పూర్తయిందని కాకుండా కరోనాపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఆయన భార్య జ్యోతిర్మయి, తనయుడు హీరో ఆదితో కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ని రూపొందించారు. కరోనా మహమ్మారిని నివారించే యుద్ధంలో ముందుండి దేశానికి రక్షణగా నిలుస్తున్న డాక్టర్లు, పోలీస్, పారిశుద్య కార్మికులు చేస్తున్న కృషిని వివరిస్తూ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ఆకట్టుకుంటోంది.