`డిస్కోరాజా` నిరాశపరిచినా మాస్ మహరాజా రవితేజ మాంచి జోరుమీదున్నారు. వరుస చిత్రాలకు గ్రీన్సిగ్నల్ ఇస్తూ షాకిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ `క్రాక్`. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆస్కార్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ కథానాయిక. ఈ నెలలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడింది.
ఇదిలా వుంటే ఈ సినిమాతో పాటు రవితేజ మరో రెండు చిత్రాల్ని అంగీకరించారు. ఏ స్టూడియో నిర్మాణంలో ఓ చిత్రంతో పాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలోని ఓ కీలక అతిథి పాత్రకు సాయిధరమ్తేజ్ని అనుకుంటున్నారట. 20 నిమిషాల నడివిగల ఈ పాత్ర సినిమాకు కీలకం కావడంతో అతనితో చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతున్నారట.
ఈ విషయం ఎంత వరకు నిజం అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సాయిధరమ్తేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వం వహిస్తున్న `సోలో బ్రతుకే సోబెటర్` చిత్రంలో నటిస్తున్నారు. దీనితో పాటు దేవా కట్టా రూపొందించనున్న సినిమా కూడా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.