నందమూరి బాలకృష్ణకు ఫేవరేట్ సీజన్ అంటే అది కచ్చితంగా సంక్రాంతి అనే చెప్పాలి. తన సినిమా ఏదైనా ఏడాది మధ్యలో ప్రారంభమైందంటే దాన్ని సంక్రాంతికి విడుదల చేస్తాడు బాలయ్య. పోటీగా ఎలాంటి సినిమా ఉన్నా కూడా పెద్ద పట్టించుకోడు. సంక్రాంతికి సినిమాను విడుదల చేసి చాలా సార్లు సక్సెస్ చూసాడు బాలయ్య. అయితే 2020 సంక్రాంతికి మాత్రం అవకాశం ఉన్నా కూడా సినిమాను విడుదల చేయడానికి రిస్క్ తీసుకోలేదు. దానికి కారణం ఈసారి సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో రూపంలో రెండు భారీ సినిమాలు విడుదలకు షెడ్యూల్ అయి ఉన్నాయి. అంతే కాకుండా రజినీకాంత్ దర్బార్, నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా కూడా సంక్రాంతికే వస్తున్నాయి. వీటికి తోడు ఈ ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కూడా దారుణంగా ప్లాప్ అవ్వడంతో బాలయ్య కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతింది. అందుకే ఈసారి సంక్రాంతి విషయంలో బాలయ్య పట్టుబట్టలేదు. క్రిస్మస్ రిలీజ్ కు సరిపెట్టుకున్నాడు.
రూలర్ కు బ్యాండ్ తప్పదా?
అయితే ఇక్కడ కూడా బాలయ్యకు మనశ్శాంతి దక్కట్లేదు. క్రిస్మస్ కు బాలయ్యకు పోటీగా సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజు పండగే చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. అలాగే వెంకీ మామ, రూలర్ కంటే ఒక వారం ముందే విడుదలవుతుంది. ఈ చిత్రానికి హైప్ బాగుంది. ఒక వారంతో ఆగిపోయే సినిమా కాదిది. ఇక డిసెంబర్ 25న ఇద్దరి లోకం ఒకటే కూడా విడుదలవుతుంది. ఇలా అన్ని వైపుల నుండి బాలయ్య సినిమాకు కాంపిటీషన్ ఉంది. ఒకవైపు రూలర్ టీజర్ చూసినవాళ్లకు ఇది రొటీన్ మాస్ మసాలా సినిమా అన్న విషయం అర్ధమైపోతోంది. ఈ నేపధ్యంలో రూలర్ సినిమా ఆ కాంపిటీషన్ ను తట్టుకుని ఎలా నిలబడుతుంది అన్నది ప్రశ్నర్ధకమే.
- Advertisement -
Advertisement