సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి తరువాత బయటికి వచ్చిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం రియాని జుడీషియల్ కస్టడీకి తరలించారు. గత కొన్ని రోజులుగా బెయిల్ కోసం ప్రత్నిస్తున్న రియాకు తాజాగా బుధవారం ముంబై కోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది.
లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్ పూచీకత్తుపై రియాకు బెయిల్ మంజూరు చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, బాసిత్ పరిహారికి మాత్రం బెయిల్ నిరాకరించింది. ఇక సుశాంత్ వంట మనిషి దీపేష్ సావత్, శామ్యూల్ మిరండాలకు యాభై వేల పూచీకత్తు మీద బెయిల్ ఇచ్చింది. డ్రగ్ పెడ్లర్లతో రియాకు సంబంధాలున్నాయన్న కారణంతో ఆమెని సెప్టెంబర్ 8న ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
తాజా పరిణామాల నేపథ్యంలో సుశాంత్ కేసు దారి తప్పుతోందని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రియాకు ఎయిల్ రావడం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల రియా కస్టడీని ఈ నెల 21 వరకు పొడిగించిన ముంబై కోర్టు వున్నట్టుండి ఆమెకు బెయిల్ మంజారు చేయడం ఆసక్తికరంగా మారింది.