సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన ముద్దాయిగా రియా మారుతోందా? అంటే జరుగుతున్న పరిణామాలు ఇదే నిజమని నిరూపిస్తున్నాయి. సుశాంత్ మరణానికి ముందు వరకు రియా అతని వద్దే వుంటూ ఆర్థిక వ్యవహారాలని చక్కబెట్టిందని, అతని అకౌంట్ లోని 15 కోట్ల డబ్బుని తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుందని సుశాంత్ తండ్రి కెకె సింగ్ రియాపై సంచలన ఆరోపణలు చేయడం, వెంటనే సీబీఐ రంగంలోకి దిగడంతో సుశాంత్ కేసు కీలక మలుపు తిరిగింది.
సీబీఐ చేతిక సుశాంత్ కేసు అప్పగించడానికి ముందు ముంబై పోలీసులు, పాట్నా పోలీసులు వేరు వేరుగా ఎంక్వైరీ చేశారు. దాదాపు 38 మందిని విచారించిన ముంబై పోలీసులు ఆ తరువాత పాట్నా పోలీసులకు సహకరించకపోవడం, ఎంక్వైరీ కోసం ముంబై వచ్చిన పాట్నా పోలీస్ అధికారిన బలవంతంగా క్వారెంటైన్కి తరలించడంతో ముంబై పోలీసులపై సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి.
ఇదిలా వుంటే మీడియా కూడా తన వంతు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. కీలక అంశాల నేపథ్యంలో డిబేట్లు నిర్వహించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మీడియాకు కీలక ఆధారాలు బయటపడ్డాయి. రియా కాల్ లిస్ట్ బయటపడిందని, అందులో సంచలన విషయాలు బయటపడ్డాయని తెలుస్తోంది. సుశాంత్ మృతి తరువాత రియా సీనియర్ దర్శకుడు మహేష్ భట్కు పదహారు సార్లు ఫోన్ చేసినట్టు రికార్డు వుందని బయటపడింది. అంతే కాకుండా పలు మీడియా కంపెనీలకు తనకు ఫేవర్గా వార్తలు ప్రచురించాలని రియా కోరినట్టు, ఇందు కోసం పీఆర్వోలని రంగంలోకి దింపినట్టు ఓ మీడియా సంస్థ సంచలన కథనాన్ని బయటికి తీసింది. దీంతో సుశాంత్ కేసులో రియా పాత్ర వుందని, ఆ కారణంగానే మహేష్ భట్తో రియా మాట్లాడిందని, మీడియా వ్యక్తులని మేనేజ్ చేసే ప్రయత్నాలు చేస్తోందని నెటిజన్స్ రియాపై మండిపడుతున్నారు.