ఓటీటీలతో భిన్నంగా వర్మ తెరపైకి తీసుకువచ్చిన డిజిటల్ ప్లాట్ ఫామ్ ATT (ఎనీ టైమ్ థియేటర్). కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా థీయేటర్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు వినోదాన్ని కొత్త మాధ్యమం ద్వారా అందించాలని రామ్గోపాల్ వర్మ ATT (ఎనీ టైమ్ థియేటర్)ని తెరపైకి తీసుకొచ్చారు.
శ్రేయాస్ ఈటీతో కలిసి వర్మ క్లైమాక్స్, నేక్డ్ (నగ్నం) వంటి చిత్రాల్ని అందించారు. త్వరలో మర్డర్, థ్రిల్లర్, 12 ఓ క్లాక్ వంటి చిత్రాలని అందించబోతున్నారు. ఇప్పటి వరకు RGV World theatre, శ్రేయాస్ ఈటీలో విడుదలైన రెండు చిత్రాలు ఊహించిన దానికి మించి రికార్డు స్థాయి వసూళ్లని సాధిచాయి. ఇదే కోవలో మరో థ్రిల్లర్ సినిమా ఈ యాప్లలో రిలీజ్ కాబోతోంది.
భవికా దేశాయ్ , వెన్నెల కిషోర్, రవివర్మ, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `302`. `ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్` అని క్యాప్షన్. చాలా కాలంగా రిలీజ్కు నోచుకోని ఈ చిత్రాన్ని శ్రేయాస్ ఈటీలో రిలీజ్ చేస్తున్నారు. కార్తికేయ మిర్యాల దర్శకుడు. అవినాష్ సుందరపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ కానుంది. క్రైమ్, కామెడీ, సస్పెన్స్తో పాటు హారర్ అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు, ఒక అమ్మాయి చుట్టూ ఒక్క రోజులో జరిగే కథ ఇదని దర్శకుడు తెలిపారు.