
సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్ ఈరోజు విడుదలైంది. ప్రస్తుతం తేజ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండడంతో రిపబ్లిక్ చిత్ర రిజల్ట్ పై సాధారణంగా కన్నా ఎక్కువ ఆసక్తి ఉంది. మరి ఫామ్ లో లేని దేవా కట్టా రూపొందించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ:
పంజా అభిరామ్ (సాయి ధరమ్ తేజ్) బాగా చదివే విద్యార్థి. ఐఐటీ గోల్డ్ మెడల్ సాధించిన అభిరామ్ సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. తర్వాత కలెక్టర్ గా డ్యూటీ తీసుకున్న అభిరామ్ కు తన విధి నిర్వహణలో అవినీతి రాజకీయ నాయకురాలు అయిన విశాఖ వాణి (రమ్య కృష్ణ) ఎదురవుతుంది. ఆమె అభిరామ్ కు ఎలాంటి ఆటంకాలు సృష్టించింది. తనకు ఎదురైన సవాళ్ళను అభిరామ్ ఎలా ఎదుర్కొన్నాడు అన్నది చిత్ర కథ.
నటీనటులు:
సాయి ధరమ్ తేజ్ హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇలాంటి చిత్రాన్ని ఒప్పుకున్నందుకే మెచ్చుకోవాలి. ఎక్కడా తడబడకుండా తేజ్ బాగా చేసాడు. ముఖ్యంగా బలమైన డైలాగులను అంతే ఇంపాక్ట్ తో చెప్పి మెప్పించాడు. రమ్య కృష్ణ నుండి మరో పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ ఈ చిత్రంలో చూడొచ్చు. అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ నాయకురాలిగా రమ్య కృష్ణ జీవించేసింది. ఐశ్వర్య రాజేష్, జగపతి బాబులకు స్క్రీన్ టైమ్ తక్కువైనా కూడా వాళ్ళ ఇంపాక్ట్ కూడా బలంగా ఉంటుంది.
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్ ప్లే విషయాల్లో దేవా కట్టా ఎక్కడా డీవియేట్ అవ్వలేదు. తను చెప్పాలనుకున్న పాయింట్ ను సరిగ్గా చెప్పాడు. ఇక డైలాగ్స్ అయితే అదిరిపోయాయి. చాలా సంభాషణలు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. క్లైమాక్స్ హార్డ్ హిట్టింగ్ గా డిజైన్ చేసాడు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జొర్సే పాట బాగుంది.
సినిమాటోగ్రఫీ ప్రధాన హైలైట్స్ లో ఒకటి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా బాగున్నాయి. దేవా కట్టా మరోసారి తనకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే ఎలాంటి ఔట్పుట్ ఇవ్వగలను అన్నది చూపించాడు.
చివరిగా:
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ పొలిటికల్ డ్రామా సమకాలికంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కొంచెం హార్డ్ హిట్టింగ్ గా అనిపించినా కానీ అదే రియాలిటీ అని అర్ధం చేసుకుంటారు ప్రేక్షకులు.
రేటింగ్ : 2.75/5