విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటోంది రెజీనా కసాండ్రా. గత ఏడాది అడివి శేష్తో కలిసి నటించిన `ఎవరు` సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఏడు తమిళ చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా వుంది. ఆమె తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న ఓ చిత్రానికి తెలుగులో `నేనే నా?` అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ని హీరో వరుణ్తేజ్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా మంగళవారం రిలీజ్ చేశారు.
కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఆపిల్ ట్రీస్ స్టూడియోస్ సమర్పణలో ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని రాజ్ శేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. మలయాళ సంగీత దర్శకుడు సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తమిళంలో `సూర్పనగై` అనే పేరుని ఫిక్స్ చేశారు. ఫస్ట్లుక్లో ఇనుప చువ్వల మధ్య బందీగా వున్న యువరాణిగా రక్తమోడుతూ కనిపిస్తున్న రెజీనా లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది.
మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ రాజు సరికొత్త నేపథ్యంలో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాలజిస్టుగా కనిపిస్తారని, ఆమెని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న చిత్రమిదని, ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని రెజీనా పోరాట ఘట్టాల్లో పాల్గొంటున్నారని, నిర్మాత రాజ్ శేఖర్వర్మ వెల్లడించారు. ఫస్ట్లుక్కి మంచి స్పందన లభిస్తోందని, ఈ సందర్భంగా హీరో వరుణ్తేజ్కు ప్రత్యేక కృతజ్ఞతలని నిర్మాత తెలిపారు.