సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రాలు ఒకేరోజు విడుదలవుతుండడంతో రెండు చిత్రాల మధ్య పోలికలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ప్రతి విషయంలోనూ పోల్చి చూడడం జరుగుతుంది. ఈ సినిమా యూనిట్ ఇలా చేసారు. వాళ్లేంటి అలా చేసారు అంటూ అన్ని విషయాల్లో పోలుస్తూనే ఉంటారు. ప్రమోషన్స్ విషయంలో అల వైకుంఠపురములో మార్కెట్ ను షేక్ ఆడిస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సామజవరగమన, రాములో రాముల సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు మూడో పాటను కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు నుండి ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో కొన్ని రోజుల క్రితం మహేష్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఈ సినిమా నుండి ఏదొక అప్డేట్ విడుదల చేయాల్సిందిగా ఎన్నో సార్లు కోరారు.
దీంతో సరిలేరు నీకెవ్వరు నుండి త్వరలోనే ఒక అప్డేట్ వస్తుందని టీమ్ అభయమిచ్చింది. ఈ చిత్రం నుండి మొదటి పాట వస్తుందని అందరూ ఆశించారు. కానీ ఇక్కడే సరిలేరు నీకెవ్వరు టీమ్ కొంచెం తెలివిగా వ్యవహరించారు. పాట కాకుండా ఏకంగా టీజర్ ను వదులుతున్నట్లుగా ప్రకటించారు. రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు టీజర్ విడుదల కానుంది. అల వైకుంఠపురములో తరహాలోనే పాట విడుదల చేసి ఉన్నట్లయితే ఆ చిత్రంతో దీనికి కంపేర్ చేస్తూ నానా రభస చేసేవాళ్ళు. పైగా అదే రోజు అల వైకుంఠపురములో నుండి మూడో పాట ఓ మై గాడ్ డాడీ పాటను విడుదల చేస్తామని టీమ్ ప్రకటించింది. ఇలా ఒకేరోజు రెండు సినిమాల పాటలు విడుదలవ్వడం కరెక్ట్ కాదని ముందు టీజర్ ను కట్ చేయించాడు అనిల్ రావిపూడి. ఈ ఒక్క టీజర్ తో మూడు పాటలకొచ్చిన క్రేజ్ ను ఒక్కసారిగా తెచ్చుకోవచ్చని సరిలేరు టీమ్ భావిస్తోంది. రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు కానీ ప్లాన్ మాత్రం బాగుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.