వరుప ఫ్లాపులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మాస్రాజా రవితేజ తాజా చిత్రంతో మాస్కి పూనకాలు తెప్పించబోతున్నాడు. ఈసారి ఖచ్చితంగా `క్రాక్` కిర్రాక్ హిట్ని తన ఖాతాలో చేర్చుకోవాలనే పట్టుదలతో వున్నట్టు కనిపిస్తున్నాడు. ఫ్లాపుల్లో వున్న గోపీచంద్ మలినేని మాస్రాజా రవితేజతో కలిసి `క్రాక్` చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరికి హిట్టు కావాలి. అదే కసితో ఈ ఇద్దరు వర్క్ చేస్తున్నట్టుగా టీజర్ని చూస్తే అర్థమవుతోంది.
గతంలో వీరిద్దరి కలయికలో డాన్ శీను, బలుపు చిత్రాలు రూపొందాయి. ముచ్చటగా మూడవ సారి `క్రాక్` కోసం కలిసి పనిచేస్తున్నారు. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో తమిళ నటి వరలక్ష్మీ శరత్కుమార్ నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర హైలైట్గా నిలిచే అవకాశం వున్నట్టు కనిపిస్తోంది. టీజర్లో విజిల్స్ వేస్తున్న తీరు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తాజాగా మేకర్స్ `క్రాక్` టీజర్ని రిలీజ్ చేశారు.
`క్రాక్` టైటిల్కు తగ్గట్టే రవితేజ కిరాక్ పోలీస్ ఆఫీసర్గా ఇందులో కనిపిస్తున్నాడు. `ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోతే మర్డరే… అంటూ ఓ వాయిస్తో టీజర్ మొదలైంది. ఆ తరువాత వచ్చే సన్నివేశాల్లో `అప్పిగా తుప్పిగా.. నువ్వు ఎవడైతే నాకేంట్రా డొప్పిగా.. అంటూ రవితేజ స్టేషన్లో ఒకడి వేలుని నరికి వికటాట్టహాసం చేస్తున్న తీరు చూస్తుంటే రేపు థియేటర్లో రవితేజ ఏ రేంజ్లో రచ్చ చేయబోతున్నాడో అర్థమవుతోంది. కొత్త తరహా టేకింగ్, మేకింగ్తో యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా మే 8న రిలీజ్ కాబోతోంది.